Sakshi News home page

మార్చి 8న పెళ్లి ఇంతలోనే ..  

Published Sun, Feb 17 2019 3:26 PM

Army Major Killed in IED Blast Near LOC  - Sakshi

న్యూఢిల్లీ : మరో నెలరోజుల్లో పెళ్లి ఉందనగా.. ఓ ఆర్మీ మేజర్‌ ప్రమాదవశాత్తు ల్యాండ్‌మైన్‌ పేలి ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి పనులతో బిజీగా ఉన్న ఆ మేజర్‌ తండ్రి కుమారుడి మరణ వార్త విని కుప్పకూలిపోయారు. ఉగ్రదాడి జరిగిన రెండు రోజులకే చోటుచేసుకున్న ఈ ఘటన మరింత విషాదాన్ని నింపింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని రాజౌరీ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో జవాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

బాంబు నిర్వీర్యం బృందాన్ని లీడ్‌ చేసే ఆర్మీ మేజర్‌ చిత్రేష్‌ సింగ్‌ బిష్త్‌.. ల్యాండ్‌మైన్‌ను డిఫ్యూజ్‌ చేయబోయే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 31 ఏళ్ల మేజర్‌కు మార్చి 8న వివాహం జరగాల్సింది. ఈ ఏర్పాట్లలో మునిగిపోయిన రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన ఆయన తండ్రి.. కొడుకు మరణ వార్త విని కుప్పకూలిపోయారు. నౌషరా సెక్టరాల్‌లో శనివారం మూడు ల్యాండ్స్‌మైన్స్‌ను భద్రతా బలగాలు గుర్తించగా.. వాటిని తొలిగించేందుకు మేజర్‌ చిత్రేష్‌ బృందం అక్కడికి వచ్చిందని, ఒకటి విజయవంతంగా తొలిగించిందని, రెండోదాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదావశాత్తు పేలిందని ఓ ఢిఫెన్స్‌ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మేజర్‌ చిత్రేష్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారని తెలిపారు. ఇక మేజర్‌ చిత్రేష్‌ మరణ వార్త తెలుసుకున్న ఉత్తరాఖాండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ట్విటర్‌ వేదికగా నివాళులర్పించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement